“ప్రతి ఆదివారం- పది గంటలకు- పది నిమిషాలు” కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నది. నేడు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని తన క్యాంపు కార్యాలయంలో నిలువ నీటిని తొలగించి శుభ్రపరిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనతో పాటు మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత తోనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ సీజనల్ వ్యాధుల నిర్మూలనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మన ఇంటిలోని నిల్వ చెత్తను, మురికి నీటిని తొలగిస్తే దోమలు పునరుత్పత్తి చెందవు, తద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు అంతమవుతాయని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరూ దీన్నొక సామాజిక కార్యక్రమంగా భావించి ప్రతి ఆదివారం తప్పనిసరిగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.