వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు వచ్చే నెలలో 1వ తేదీన మొదలు పెట్టిన తదుపరి 2 గం లోగా పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో పేదలందరికీ ఇల్లు పంచాయతీ ఎన్నికలు కరోనా పట్ల అప్రమత్తత విషయాలపై సమీక్ష నిర్వహించారు.
ఉగాది నాటికి పేదలకు అందించాల్సిన 25లక్షల ఇళ్లపట్టాలపై చేస్తున్న ఏర్పాట్లపై జిల్లాల వారీగా అధికారులు, కలెక్టర్లతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇళ్లస్థలాల కోసం గుర్తించిన భూముల్లో ప్లాట్ల డెవలప్మెంట్ వేగవంతంగా పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధిని అనుకున్న గడువులోగా పూర్తి చేయాలన్నారు. విశాఖపట్నం జిల్లాలో పేదలందరికీ ఇల్లు పథకంలో అవసరమైన గృహాలకు సంబంధించిన ప్లాట్లను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్ ముఖ్యమంత్రికి తెలిపారు. స్థల సేకరణ పూర్తయిందని, 20 మంది కాంట్రాక్టర్లతో పనులు చేపట్టామని, జీవీఎంసీ వి ఎం ఆర్ డి ఎ ఇంజనీర్లు నగరంలోని ఇళ్లకు, గ్రామీణ ప్రాంతంలోని ఏం లకు సంబంధించి జిల్లా యంత్రాంగం పనులు పూర్తి చేస్తున్నారని తెలిపారు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి “గుడ్, ఆల్ ది బెస్ట్” అంటూ వినయ్ చంద్ ను ప్రశంసించారు. నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పోలీసు యంత్రాంగం దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు రుజువు అయితే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు, మూడేళ్ల జైలు శిక్ష విధించాలన్నారు.
గ్రామాల్లో ఉన్న మహిళా పోలీసు, పోలీసు మిత్రలను ఉపయోగించుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల నిర్వాహణ దేశానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన నిరోధానికి ప్రత్యేక యాప్. ఏం జరిగినా ఈ యాప్లో నమోదయ్యేలా గ్రామ, వార్డు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు.
కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుండి జిల్లా కలెక్టరు వినయ్ చంద్ తో పాటు జాయింట్ కలెక్టర్లు ఎల్ శివ శంకర్, ఎం. వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ అట్టాడ బాపూజీ, వి ఎంఆర్ డి ఎ కమిషనర్ పి కోటేశ్వరరావు జడ్పీ సీఈవో నాగార్జునసాగర్ డి పి ఓ ఆర్ గోవిందరావు పిడి హౌసింగ్ జయ రామ చారి జివిఎంసి వి యం ఆర్ డి ఎ అధికారులు పాల్గొన్నారు.