సమాజంలోని అన్ని వర్గాల వారిని వంచించాక, నువ్వే మా నమ్మకం జగనన్న అని ఎవరైనా అంటారా? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు అందడం లేదని, ఏ ఒక్క లబ్ధిదారునికి ఇంటిని నిర్మించి ఇచ్చిన పాపాన పోలేదని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్యను దూరం చేసి… నాలుగేళ్ల పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేయకుండా, ఇప్పుడు అమలు చేస్తామంటే ప్రజలు విశ్వసిస్తారా?, మా నమ్మకం నువ్వే జగనన్న అని అంటారా??? అంటూ నిలదీశారు.
సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను ఇంకా మోసం చేయవచ్చుననే భ్రమలలో నుంచి, గారడీ విద్యల నుంచి తమ పార్టీ పెద్దలిప్పటికైనా బయటికి రావాలన్నారు. పల్లె నిద్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పేరిట ఏర్పాటు చేయదలచిన జగనన్న కాలనీలలో బస చేయాలని సూచించారు.
జగనన్న కాలనీలలో ముఖ్యమంత్రి బస చేస్తే నైనా రోడ్డు, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి సౌకర్యాలు ఆయా కాలనీలలో ఏర్పడతాయన్నారు . ఏమీ లేని దాన్ని ఉందనుకొని వై నాట్ 175 అని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. జగనన్న కాలనీలలో బస చేస్తే జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ పల్స్ అర్థమవుతుందన్నారు.
15 లక్షల మందికే పట్టాలు
30 లక్షల కుటుంబాలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లయిన ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఇంటిని నిర్మించి ఇవ్వలేదని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. 30 లక్షల మందికి ఇళ్లను ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం 15 లక్షల మందికి మాత్రమే ఇంటి స్థలాలను కేటాయిస్తూ పట్టాలను అందజేశారన్నారు. అందులోనూ ఓ ఏడు ఎనిమిది లక్షలమంది తమ పార్టీ నేతలకు డబ్బులు ఇచ్చి పట్టాలను కొనుగోలు చేశారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు కేటాయించలేదని చెప్పారు. పాలకొల్లులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందచేయకపోవడం దారుణమన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు అందజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30 వేల రూపాయలను మాత్రమే అందజేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 30 వేల రూపాయలతో 450 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇప్పటికీ ఇప్పుడు ఇంటి నిర్మాణాలు చేపట్టకపోతే పట్టాలను రద్దు చేసి, ప్లాట్ లను వెనక్కి తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పుచేసి ఎలాగో అలాగా ఇంటి నిర్మాణం చేపడితే, అక్కడ రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి వంటి కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎక్కడ కూడా మంచినీటి వసతి కోసం ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించిన దాఖలాలు లేవని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
రాష్ట్రంలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం వంటి ప్రతిష్టాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా పరిశీలించి, పర్యవేక్షించకపోవడం విస్మయాన్ని కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా కాలనీలలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవాలని, అవసరమైతే గృహనిర్మానదారులకు ఇసుకను ఉచితంగా అందజేయాలన్నారు. గతంలో 30 లక్షల కుటుంబాలకు ఇళ్లను నిర్మించి ఇస్తే ఇంటికి మూడు ఓట్ల చొప్పున కోటి ఓట్లు తమయేనన్న ధీమాతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్నారు. కానీ ఇప్పటివరకు ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించకపోవడంతో పరిస్థితి తిరగబడిందన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇంటి నిర్మాణానికి
కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రూపాయలను మంజూరు చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ పేరును ఎక్కడ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. తామే కష్టపడి ఇల్లు కట్టుకున్న ప్రజలు తాను ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీ కి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. అలాగే టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేసినంతమాత్రాన లబ్ధిదారుల మనుషుల్లో చోటు సంపాదించుకోవడం కష్టమని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.