జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మాజీ మంత్రి కె ఎస్ జవహర్ అన్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండే కాకుండా పంచాయతీరాజ్, మున్సిపల్ నిధులు 6,700 కోట్లు, అభయహస్తం నిధులు 2,118కోట్లు, భవన కార్మికుల యోగ క్షేమ నిధులు రూ.1000 కోట్లు, రైతుల ధాన్యం కొనుగోలు నిధులు 3 వేల కోట్లు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ కింద ప్రభుత్వం వాడుకొని వారికి అన్యాయం చేశారని అన్నారు.
రెండు నెలల్లో ప్రభుత్వం తెచ్చిన 30 వేల కోట్లు అప్పులు ఏమయ్యాయి? తెచ్చిన అప్పులు చాలక ఈ డైవర్షన్ చేస్తున్నాడేమో అని అనుమానం కలుగుతుందని జవహర్ అన్నారు. ఏదే ఏమైనా తెచ్చిన అప్పుల లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు, దళిత, కార్మిక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా నడుస్తోందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను కూడా మోసం చేసే నేర్పరితనం గల ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డేనని ఆయన అన్నారు.
సీఎస్ సమీర్ శర్మ డూడూ బసవన్న లా తయారయ్యారని, జగన్ చేసేది తప్పా? వప్పా అని చెప్పాల్సిన వారు చెప్పడంలేదని జవహర్ అన్నారు. సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ పెట్టారు. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసినప్పడు జగన్ తో పాటు జైలుకు వెళ్లిన శ్రీలక్ష్మికి ఎలా పోస్టింగ్ ఇచ్చారో చెప్పాలి. మీరంతా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటూ దొంగలకు ద్వారాలు తెరుస్తున్నారు అంటూ ఆయన విమర్శించారు.
సీపీఎస్ పై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని, సీపీఎస్ ను రద్దు చేస్తానని చెప్పి మాట తప్పి.. మడమ తిప్పారు. సీపీఎస్ కు సంబంధించిన డీఏ రికవరీస్ లను వారి ఖాతాలలో జమ చేయకుండా వాటిని కూడా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ కు ఉపయోగించుకుంటున్నారు. ఉద్యోగ సంఘాలు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆయన అన్నారు.
సీపీఎస్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. పీఎఫ్ లో అన్యాయం జరుగుతోంది. సర్వీస్ రూల్స్ లేవు. అశాస్త్రీయ విభజన వల్ల సర్వీస్ రూల్స్ లేవు, ప్రమోషన్స్ లేవు. ఎస్ జీటీ గా జాయిన్ అయినవారు ఎస్జీటీగానే రిటైర్ అవ్వాల్సి వస్తోంది. 4,786 ఎస్జీటీ పోస్టులను నేడు సప్రెస్ చేసి ఆ డబ్బులను కూడా జగన్ వాడుకున్నారు అని జవహర్ ఆరోపించారు.
జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారని, రెండు సంవత్సరాలు దాటింది శచివాలయ ఉద్యోగులలో ఎంతమందిని రెగ్యులరైజ్ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన బాధ్యత ఉద్యోగస్థులపై ఉందని జవహర్ అన్నారు.
వైసీపీ నాయకులు జగన్ భజన మాని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలని, ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడో ప్రజలు గమనించాలని మాజీ మంత్రి కె ఎస్ జవహర్ వివరించారు.