ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, ఖాళీల భర్తీపై వై ఎస్ జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఈ నెల 13న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.
ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల విషయాన్ని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్న విధంగానే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. ఎన్నికల హామీగా తాను చెప్పిన విషయాన్ని నెరవేర్చినట్లు కూడా సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సీఎం కాగానే వై ఎస్ జగన్ మర్చిపోయిన హామీలను గుర్తు చేస్తూ 9 లేఖలు రాస్తానని రఘురామకృష్ణంరాజు ప్రకటించారు.
అదే విధంగా రోజుకో లేఖ రాస్తూ వై ఎస్ జగన్ ను ఇరకాటంలో పెడుతున్నారు. జాబ్ క్యాలెండర్ గురించి రఘురామ లేఖ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులలో చర్చ మొదలైంది. వివిధ విద్యార్ధి సంఘాలు, అన్ని పార్టీల యువజన సంఘాలు ఎన్నికల హామీ అయిన జాబ్ క్యాలెండర్ పై ఆందోళనకు ఉపక్రమిస్తున్నాయి. దాంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాల్సి వచ్చింది.
2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తూ 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయని, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని వై ఎస్ జగన్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2.50లక్షలకు పైగా నిరుద్యోగులను భాగస్వామ్యం చేశామని. ఏపీలో ఇప్పటివరకు 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన తెలిపారు.
గ్రామ సచివాలయాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పశుసంవర్ధక శాఖలో 6,100 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 18వేల ఉపాధ్యాయ, ఆరు వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రఘురామకృష్ణంరాజు ఈ నెల 13న రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఉద్యోగాల భర్తీ చేయకుండా వదిలేశారని, వందల సంఖ్యలో సెక్రటేరియల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మెగా డీఎస్సీ తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. అత్యవసరంగా పరిగణించి వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని రఘురామకృష్ణంరాజు తన లేఖలో డిమాండ్ చేశారు.
దీనికి సమాధానంగానా అన్నట్టు సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.