ఏలూరు జిల్లా దెందులూరు నియోజక వర్గం లో ఈనెల 25వ తేదీన కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపనలు చేయనున్నారని దెందులూరు శాసన సభ్యులు కొటారు అబ్బయ్యచౌదరి సోమవారం తెలిపారు. ఏలూరులో ఉన్న దెందులూరు నియోజక వర్గ కాంప్ కార్యాలయం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన, సి ఎం చేయబోయే అభివృద్ధి పనుల శంఖుస్థాపనల వివరాల పై నియోజక వర్గ స్థాయి ప్రజా ప్రతినిధులతో వై సి పి నాయకులతో ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి సమీక్షించారు.
ఈ సందర్భం గా ముఖ్యమంత్రి జగనన్న ఆసరా పథకం ద్వారా ఆడపడుచులకు అందించే ఆసరా పథకం నిధులు 500 కోట్లు దెందులూరులో బటన్ నొక్కి ప్రారంభిస్తారని అబ్బయ్యచౌదరి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి సర్పంచ్ లు, ఎం పి పి లు, జెడ్ పి టి సి లు, ఎం పి టి సి లు, సొసైటీ చైర్ పర్సన్ లు, వై సి పి నాయకులు కార్య కర్తలు తమ తమ గ్రామాల నుండి వై సి పి ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన మహిళలను పురుషులను దెందులూరు లో జరగనున్న సి ఎం జగన్మోహన్ రెడ్డి సభకు ప్రతి గ్రామం నుండి 1000 నుండి 2000 మందిని తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన ప్రతి కుటుంబం సి ఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొంటారన్నారు. ప్రతి గ్రామం నుండి జగనన్న ప్రభుత్వం లో అబ్బయ్యచౌదరి పరిపాలనలో లబ్ది పొందిన ప్రతి కుటుంబాన్నీ ఆహ్వానించండి ప్రభుత్వం ద్వారా పింఛన్లు, రుణ మాఫీలు, జగనన్న ఆసరా జగనన్న దీవెన, అమ్మవడి, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరూ సి ఎం పర్యటనలో పాల్గొనేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి పిలుపునిచ్చారు.
లబ్దిపొందిన ప్రతి ఒక్కరూ వస్తారని ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి అన్నారు. పెదవేగి మండల కేంద్రం లో ఉన్న సీతమ్మ చెరువు ను 65 కోట్ల రూపాయలతో పోలవరం కుడికాలువ ద్వారా నీటిని మళ్లించి నీళ్ల చెరువు గా అభివృద్ధి చేసి అన్ని గ్రామాలకు ఈ చెరువు ద్వారా త్రాగునీరు అందించనున్నామని చెప్పారు. అదేవిధంగా గార్లమడుగు పంచాయతీ సూర్యారావుపేట లో 60 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న చెరువును 76 కోట్ల రూపాయలతో అభివృద్ధిచేసి పోలవరం కాలువ నీటితో నింపి మెట్ట ప్రాంత భూములకు సాగునీరు అందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు.
ఏలూరుజిల్లా పరిధిలో పెదవేగి ముసునూరు మండలాల మధ్య ఉన్న తమ్మిలేరుపై 17 కోట్ల రూపాయలతో బలివే పై వంతెన నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేశారు. దెందులూరు మండలం గోపన్నపాలెం నుండి పెదవేగి మండలం కూచింపూడి వరకు 5.5 కోట్లతో అభివృద్ధి కి నిధులు మంజూరు అయ్యాయని ప్రస్తుతం ఆ రోడ్డు అభివృద్ధి టెండర్ స్టేజ్ లో ఉందని తెలిపారు. పెదవేగి మండలం లో కొప్పాక నుండి నూజువీడు, రామసింగవరం నుండి బాధరాల వెళ్లే రోడ్డు, పెదవేగి నుండి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మీదగా రాట్నాలకుంట టెంపుల్ రోడ్డు లో మిగిలిపోయిన బిట్లను త్వరలో పూర్తి చేయబోతున్నట్టు ఎం ఎల్ ఏ తెలిపారు.
కొల్లేరు రెగ్యులేటర్ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి పరిశీలించనున్నట్టు చెప్పారు. కొట్లాది రూపాయలతో దెందులూరులో నిర్మించిన 30 పథకాల ప్రభుత్వాస్పత్రిని, 75 కోట్లతో పెదవేగి మండలం లో నిర్మించే విద్యుత్ సబ్ స్టేషన్ కి ముఖ్యమంత్రి శంఖుస్థాపనలు చేస్తారని ఎం ఎల్ ఏ తెలిపారు.