ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కుప్పం పర్యటనకు వస్తున్నారంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరీ ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ ప్రజలు తమ ప్రాంతానికి జగన్ వస్తున్నాడు నిధుల వర్షం కురిపిస్తాడని భావించారు. పెద్ద ప్యాకేజీ ప్రకటించి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు అని అనుకున్నారు.
అయితే నేడు కుప్పంలో పర్యటించిన సీఎం జగన్ కేవలం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడిని తిట్టడం వరకే పరిమితం అయ్యారు. దాంతో కుప్పం ప్రజలలో తీవ్ర నిరాశ వ్యక్తం అయింది. కుప్పంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. కుప్పం ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. కుప్పం ఎమ్మెల్యే హైదరాబాద్ కు లోకల్. కుప్పానికి చంద్రబాబు నాన్ లోకల్. కుప్పానికి ఆయన చేసిందేమీ లేదు. తనకు కావాల్సింది కుప్పం నుంచి పిండుకున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పంలో కరువు సమస్యను పరిష్కరించలేదు….అంటూ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో చంద్రబాబునాయుడిని విమర్శించారు.
కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు… కుప్పానికి కనీసం నీళ్లు కూడా తీసుకురాలేదు. ఆ ఆలోచన కూడా చేయలేదు. మున్సిపాలిటీలో కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేదు. కృష్ణగిరి- పలమనేరు హైవే పనుల్ని చేయలేదు. కుప్పంలో ఎయిర్పోర్టు కడతామని చెవుల్లో పూలు పెట్టారు. ప్రజల ఒత్తిడితో రెవెన్యూ డివిజన్ కోసం నాకు చంద్రబాబు లేఖ రాశారు. ఇంతకన్నా చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటారా? ఒక్కసారి కూడా కుప్పం సీటు బీసీలకు ఇవ్వలేదు. చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు లేదు, ఓటు లేదు. హైదరాబాదే ముద్దు అని చంద్రబాబు భావించారు. అందుకే హైదరాబాద్లో ఇంద్రభవనం కట్టుకున్నారు అని జగన్ విమర్శలు గుప్పించారు.