సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను నేడు వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం జగన్ స్వయంగా పరిశీలిస్తున్నారు.
ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్కు వివరిస్తున్నారు. అనంతరం సీఎం జగన్ పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. స్పిల్ వే పరిశీలనకు సీఎం జగన్ బయలుదేరారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా మధ్యాహ్నం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.
గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా 2019 జూన్ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తొలుత వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్ డ్యామ్ల మధ్య ఈసీఆర్ఎఫ్ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు. ఆ లోగా కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటరీల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు.
టీడీపీ సర్కారు నామినేషన్ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28, డిసెంబర్ 14న క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు.
గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఉన్నారు.(వీడియో చూడండి)