
సీఎం కేసీఆర్ మహిళల పక్షపాతి అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో పుడుతున్నారని, గర్భిణిలకు పౌష్టికాహారం అందడం లేదని సర్వేలో తేలడంతో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పొష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు.
నేటి నుంచి ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం అన్ని పరీక్షలు నిర్వహిస్తారన్నారు. స్త్రీని పూజించే సంస్కృతి కేవలం భారతదేశంలోనే ఉందన్నారు. 2012 లో పావలా వడ్డీ పథకం ప్రారంభమైందన్నారు. తెలంగాణ వచ్చాక 2014 నుంచి వడ్డీలేని రుణాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. కరోనా ఇతరత్రా కారణాల వల్ల వడ్డీలేని రుణాల నిదులు ఇవ్వడం ఆలస్యమైందని తెలిపారు.
జిల్లాలో బకాయి ఉన్న 41.31 కోట్ల వడ్డీలేని రుణాలను ప్రభుత్వం విడుదల చేసిందని, మరొక ఏడాదిన్నర నిధులు ఇవ్వాల్సి ఉందని, వాటిని కూడా ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందన్నారు. అనంతరం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలకు సంబందించిన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎంపీ బిబిపాటిల్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ట్రైనీ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అధికారులు, జడ్పీ చైర్మన్ దఫిదార్ శోభ, మున్సిపల్ చైర్మనా నిట్టు జాహ్నవి, నాయకులు పాల్గొన్నారు.