కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర సంపదను దోచుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలంతా కరోనాతో ఇబ్బందుల్లో ఉంటే ఆగమేఘాల మీద సచివాలయాన్ని కూల్చివేసిన అవసరం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.
మధిర క్యాంపు కార్యాలయంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేడు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడున్నారో బయటకొచ్చి వాస్తవాలు ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చెప్పిన విధంగా మీరు, మీ ఎమ్మెల్యేలు మాస్కులు లేకుండా బయటకు వచ్చి సేవ చేయండి అని ఆయన సవాల్ చేశారు.
ఎన్నికల హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని ఆయన అన్నారు. రాష్ట్ర సంపదను ధ్వంసం చేస్తే కెసిఆర్ ను రాష్ట్ర ప్రజలు క్షమించరు అని బట్టి విక్రమార్క అన్నారు.