గత ప్రభుత్వాలు సేద్యగాళ్లను విస్మరించడంతో వ్యవసాయం కుంటుపడి వలసల పాలయ్యాం, తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు గౌరవం పెరిగిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిలో చెప్పారు. వలస వెళ్లిన వారు తిరిగొచ్చి వ్యవసాయం చేస్తున్నారని, లోకానికి అన్నం పెట్టే రంగం ఆహారరంగం, పునాది వ్యవసాయం, అది చేసేది రైతన్న వారిని గుర్తించి గౌరవించింది కేసీఆర్ మాత్రమేనని మంత్రి అన్నారు.
రైతేరాజు అందరికీ నినాదం అయిందనీ అది కేసీఆర్ విధానం, మూడేళ్లలో ప్రపంచంలో ఎత్తయిన కాళేశ్వరం కేసీఆర్ నిర్మించడం ఒక రికార్డు, 23 నెలలలో ఏదుల రిజర్వాయర్ నిర్మించడం దేశంలో రికార్డు అని ఆయన తెలిపారు. మారిన పరిస్థితులతో పల్లెలు పాడిపంటలతో దర్శనమిస్తున్నాయని ఉచిత కరంటు ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నామని, వ్యవసాయం చేసే ఏ దేశంలోనూ కేసీఆర్ మాదిరిగా రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు వంటి పథకాలు లేవన్నారు.
కేవలం జర్మనీలో మాత్రం రసాయనాలు తక్కువగా వాడిన రైతులకు ప్రోత్సహకాలు ఇస్తారని, అధికంగా వాడినట్లు తేలితే భారీ జరిమానా విధిస్తారని చెప్పారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పార్టీలకు ఇన్నేళ్లలో రైతులకోసం ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేయలేదని మంత్రి ప్రశ్నించారు.
రైతు బంధు ఎన్నికల కోసం కాదు…
రైతుబంధు పథకం ఎన్నికల హామీ కాదని, రైతుల డిమాండ్ కాదని,పెట్టుబడి కోసం అప్పుల పాలవుతున్న రైతులకు మేలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మనస్సు నుండి పుట్టినదని, రైతుబంధును ఎన్నికల పథకం అని ఎద్దేవా చేశారన్నారు.
ఇప్పుడు అది ఎనిమిదో విడతతో రూ.50 వేల కోట్లకు చేరిందని, ఇప్పటి వరకు ఏడెకరాల లోపున్న 60.16 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6008 కోట్లు జమచేయడం జరిగిందన్నారు. మిగిలిన వారందరి ఖాతాలలో ఒకటి రెండు రోజులలో జమ అవుతాయని, తెలంగాణ పల్లెలు, పాఠశాలలు, మార్కెట్లు, పంటపొలాలలో రైతుల రైతుబంధు సంబరాలు జరుగుతున్నాయని చెప్పారు.
కడుపులో పెట్టుకుని కాస్తున్న కేసీఆర్ కు కృతజ్ఞతగా రైతన్నల సంబరాలు, రైతుబంధు పథకం కింద అన్నదాతలకు రూ.50,600 కోట్లు, కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అయిందన్నారు. కరోనాతో ప్రపంచం అంతా మూతపడ్డా వ్యవసాయ రంగం మూతపడలేదని, ఏది లేకున్నా ఈ ప్రపంచాన్ని వ్యవసాయం, సేద్యం బతికిస్తుందని మంత్రి అన్నారు.
భూముల ధరలు విపరీతంగా పెరిగాయి…
తెలంగాణ రాకముందు 32 లక్షల ఎకరాలున్న వరి సాగు రాష్ట్రంలో గత ఏడాది కోటి 6 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. ఎఫ్ సీ ఐ దేశం మొత్తం సేకరించిన వరి ధాన్యంలో 54 శాతం ఒక్క తెలంగాణ నుండే సేకరించిందని,ఆఖరుకు తెలంగాణ నుండి వడ్లు కొనలేం అని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వ అండతో రైతులు పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నారని చెప్పారు. కేంద్రం ఎగుమతులు చేయకుండా గోదాంలు లేవని చెప్పడం అనాలోచితం, అభ్యంతరకరమని మంత్రి విమర్శించారు.దీనిపై రాష్ట్రంలో, దేశంలో చర్చ జరగాలని,మంత్రిగా వనపర్తికి, వ్యవసాయ శాఖకు కేసీఆర్ ఆశీస్సులతో వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి వ్యవసాయ మంత్రిగా ఉన్నానని, వనపర్తి లో దాదాపు లక్షా 15 వేల ఎకరాలకు సాగు నీరు తీసుకువచ్చామని, మరిన్ని ఎకరాలకు సాగునీరు తెస్తామని, దాదాపు 60 మినీ ఎత్తిపోతల పథకాలతో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు.
వనపర్తిలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో 600 పడకల ఆస్పత్రి వచ్చిందని, వైద్యానికి హైదరాబాద్ ఏ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అక్కర్లేదని చెప్పారు. వనపర్తికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరయిందని, వచ్చే ఏడాది నుండి తరగతులు ప్రారంభమవుతాయని, వనపర్తిని విద్యాహబ్ చేశామని చెప్పారు.
మోడీ సొంత రాష్ట్రంలో కరెంటు లేదు…
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఉచిత కరంటు లేదని, బీజేపీ పాలిత యూపీలో 25, 30 లక్షల ఆయిల్ ఇంజన్ల మీదనే రైతులు వ్యవసాయం చేస్తున్నారని, తెలంగాణలో 30 లక్షల బోర్లకు కరంటు ఉచితంగా ఇస్తున్నామన్నారు.
అన్నదాతలకు కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసం వచ్చిందని, గౌరవం పెరిగిందని,వారు మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నదన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని,ఈ ప్రయత్నంలో ప్రజలు, రైతన్నల ఆశీస్సులు టీఆర్ఎస్ కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ఉండాలన్నారు.
మట్టిని నమ్ముకున్న రైతుకు మహర్దశ
మట్టిని నమ్మకున్న రైతు ఎన్నటికీ చెడిపోడని, వనపర్తిని టాప్ 5 నియోజకవర్గాల స్థానంలో ఉంచడమే లక్ష్యమని తెలిపారు. దీనికి ప్రజలు, అభిమానులు, కార్యకర్తల ఆశీస్సులు, మద్దతు ఉండాలని కోరారు. 300 ట్రాక్టర్లతో అన్నదాతల మహార్యాలీ, రైతన్నలతో కలిసి ఆడబిడ్డల బోనాలు, బతుకమ్మలు, తప్పెట్లు, లొల్లొడుకులు, డిల్లెం, పల్లెం, వీధిబాగోతులు, చిందు కళాకారుల కవాతు వనపర్తి జిల్లాకేంద్రంలో నిర్వహించిన రైతుబంధు సంబరాలను ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రసంగించారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యంన్యూస్.నెట్