బడ్జెట్ లో దళిత గిరిజనుల కు కేటాయించిన నిధులు ఎందుకు పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదో చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. కేసీఆర్ అవలంబిస్తున్నదళిత గిరిజన అణచివేత చర్యలకు నిరసిస్తూ నే కాంగ్రెస్ దండోరా కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కు ఊహించిన దానికంటే ఎక్కువ జనం వస్తున్నారని ఆయన అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన దళితుల భూముల ఎందుకు గుంజుకుంటున్నారని మల్లు రవి ప్రశ్నించారు.
మూడు చింతల పల్లి లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళే రోడ్డు ఎత్తు పెంచడం ద్వారా దళితుల ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఆ గ్రామంలో దళితుల కష్టాలను ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో మూడెకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వలేదు, ఈ సమస్యలపై రేవంత్ రెడ్డి మాట్లాడితే మంత్రి మల్లా రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారు అని ఆయన తెలిపారు.