27.7 C
Hyderabad
April 20, 2024 01: 37 AM
Slider ప్రత్యేకం

రాయలసీమ ఎత్తిపోతలను అపెక్స్ కౌన్సిల్ లో ఎండగడతాం

#CMKCR

ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికున్న అభ్యంతరాలను కూడా కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయంలో తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. అజెండాలో చేర్చాల్సిన అంశాలను కూడా ఆ లేఖలో పేర్కొంటామని చెప్పారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, జల వనరుల శాఖ సలహాదారు ఎస్.కె.జోషి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, ఇఎన్సి నాగేందర్ రావు, అధికారులు కోటేశ్వర్ రావు, ప్రసాద్, విజయ్ కుమార్, వెంకట నారాయణ, సీనియర్ అడ్వకేట్ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర సమాచారం సిద్ధం చేయండి

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం, ఎపి ప్రభుత్వం లేవనెత్తిన అన్ని సందేహాలను కౌన్సిల్ సమావేశంలో నివృత్తి చేయాలని, దీనికి సంబంధించి సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులనే తెలంగాణ అవసరాలను తీర్చే విధంగా రీ డిజైన్ చేశామని సిఎం చెప్పారు.

ఇదే విషయాన్ని ఆధారాలతో సహా కౌన్సిల్ సమావేశంలో చెప్పాలని నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఎన్ని నిధులు కేటాయించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? ఎన్ని టిఎంసిలు కేటాయించారు? తదితర వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

పోతిరెడ్డి పాడు విస్తరణ అభ్యంతరకరం

ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం వ్యవహరిస్తున్నదనే విషయాన్ని ఆధార సహితంగా వివరించాలని చెప్పారు. పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపుతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు.

నీటి కేటాయింపులు లేకున్నా, అనుమతులు లేకున్నా, ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంలో కూడా సమావేశంలో నిలదీయాలని చెప్పారు. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణకు జరిగే  అన్యాయంపై పోరాటం కేంద్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నీ అర్థం పర్థం లేనివే అని సిఎం స్పష్టం చేశారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణకు జరుగతున్న అన్యాయాలపై గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేశామని, ఈ సారి జరిగే అపెక్స్ కౌన్సిల్ లో అయినా ఆ అంశాలను చేర్చి న్యాయం చేయాల్సిందిగా కోరుతామని సిఎం చెప్పారు.

Related posts

బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందన

Satyam NEWS

టీ టైం సెంటర్ ను ప్రారంభించిన ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్ రెడ్డి

Satyam NEWS

దళితులపై దమన కాండ కొనసాగిస్తున్న జగన్ సర్కార్

Satyam NEWS

Leave a Comment