రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తన హద్దుల్లో తాను ఉండాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ సమావేశంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఒకరి నొకరు తిట్టుకున్న విషయం తెలిసిందే. టిడ్కో ఇళ్లపై అవినీతి గురించి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించడంతో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆయనను బూతులు తిట్టారు.
సమావేశం రసాభాస కావడంతో బాటు అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలు దిగజారాయి. దాంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వారిద్దరిని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా పిలిచారు. దాంతో నేడు వారిద్దరూ తాడేపల్లిలో సిఎం క్యాంపు కార్యాలయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.
గతంలో తనకు సంబంధంలేని తోట త్రిమూర్తులు శిరో ముండనం కేసు వ్యవహారం పై కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ అనవసరమైన వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఇతర విషయాలు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ముఖ్యమంత్రి హెచ్చిరిక చేసినట్లు తెలిసింది.
విశాఖపట్నం జిల్లాలో కూడా అవినీతి అంశంపై అధికార పార్టీలోని ముఖ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. విజయసాయి రెడ్డి తదితరులను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి పిలిచి మాట్లాడారు. ఇప్పుడు కాకినాడ పంచాయితీ తీర్చారు.