ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి తరలి వెళ్లేందుకు కొత్త వ్యూహం రచిస్తున్నారు. ఈ మేరకు తుది నిర్ణయం కూడా తీసుకుని అమలు చేయడం ఒక్కటే తరువాయి. రాజధాని అమరావతి ని తరలించేందుకు కొన్ని న్యాయ పరమైన ప్రతిబంధకాలు ఎదురైన విషయం తెలిసిందే.
విజిలెన్స్ కార్యాలయాన్ని న్యాయ రాజధాని కర్నూలుకు తరలించేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జారీ చేసిన జీవోలను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. అంతే కాకుండా రాజధాని తరలింపు తదితర అంశాలపై వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఈ కారణంగా మూడు రాజధానుల విషయం వాయిదా పడుతూ వస్తున్నది.
ఏప్రిల్ 4వ తేదీకల్లా అమరావతి నుంచి తరలి పోవాలని ముందుగా అనుకున్నా ఈ అవాంతరాల వల్ల కుదరలేదు. ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వకుండా వివిధ శాఖాధిపతులు తమ తమ సిబ్బందికి విశాఖపట్నం వెళ్లేలా సామాను సర్దుకుని ఉండాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.
అదే విధంగా విశాఖ పట్నంలోని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తాజా ఆదేశాలు ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. ఏ క్షణమైనా అమరావతి నుంచి రాజధానిని విశాఖ తరలిస్తాం అప్రమత్తంగా ఉండండి అంటూ మౌఖిక సూచనలు వస్తూనే ఉన్నాయి.
న్యాయ పరమైన చిక్కులు ఉన్నందున రాజధాని తరలింపు ఇప్పటిలో సాధ్యం కాదని అనుకునేవారికి ఆశ్చర్యం కలిగించే పరిణామాలు జరగబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో ఏ రాష్ట్రం లో కూడా మిగిలిన పాలనాంశాలు పక్కన పెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్ని రాజకీయ పరమైన, విధాన పరమైన నిర్ణయాలు జరుగుతూనే ఉన్నాయి.
నామినేటెడ్ పోస్టులు మంజూరు చేస్తూనే ఉన్నారు. కరోనా వ్యాధి గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఎక్కువ గా ఉన్నది. అంటే అమరావతి ప్రాంతంలో కరోనా వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ కారణంగా పరిపాలనకు ఆటంకం కలిగే పరిస్థితి తలెత్తకూడదని భావిస్తున్నారు. అందువల్లే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అతి త్వరలో విశాఖ కు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖకు తరలి వెళ్లిపోవడానికి ఎవరూ అభ్యంతర పెట్టే అవకాశం ఉండదు. ముఖ్యమంత్రి కార్యాలయం తరలి వెళితే వివిధ శాఖాధిపతులు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం ఉన్నప్పుడు రావాల్సి ఉంటుంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోనే సగం మంది మంత్రులు ఉన్నందున వారంతా విశాఖ పట్నం లోనే ఉండవచ్చు. అతి త్వరలో ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖ పట్నానికి వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు.