పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలకసంస్థ కు ఐదుగురిని నేడు కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. నగరపాలకసంస్థ కో-ఆప్షన్ సభ్యులుగా ఎస్.ఎం.ఆర్ .పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్, గుడివాడ రామచంద్ర కిషోర్,గంపల బ్రహ్మవతి, నీతా విజయ్ కుమార్ జైన్ లు ఎన్నికైనట్లు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇటీవలే నగరపాలక సంస్థ అధికారులు కో-ఆప్షన్ సభ్యులుగా ఉండేందుకు అర్హులైన వారి నుండి నామినేషన్లు స్వీకరించారు. మొత్తం ఐదు నామినేషన్లు మాత్రమే రావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది.
నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ సర్వ సభ్య సమావేశ మందిరంలో గురువారం నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. కో-ఆప్షన్ సభ్యుడిగా మున్నుల జాన్ గురునాథ్ పేరును డిప్యూటీ మేయర్ గుడిదేశీ శ్రీనివాస్ ప్రతిపాదించగా 39వ డివిజన్ కార్పొరేటర్ కిలాడి జ్యోతి బలపరిచారు. గంపల బ్రహ్మవతి పేరును 38వ డివిజన్ కార్పొరేటర్ తోట హేమమాధురి ప్రతిపాదించగా 15వ డివిజన్ కార్పొరేటర్ తంగెళ్ల రాము బలపరిచారు. అలానే గుడివాడ రామచంద్రకిషోర్ పేరును 8వ డివిజన్ కార్పొరేటర్ వంకదార ప్రవీణ్ కుమార్ ప్రతిపాదించగా 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి బలపరిచారు.
ఎస్ఎంఆర్ పెదబాబు పేరును 9వ డివిజన్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్ ప్రతిపాదించగా 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు బలపరిచారు. నీతా విజయ్ కుమార్ జైన్ పేరును 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్ ప్రతిపాదించగా 11వ డివిజన్ కార్పొరేటర్ కోయ్యా జయగంగా బలపరిచారు. అనంతరం నూతన కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ప్రకటించారు. అనంతరం అధికారులు నూతనంగా ఎన్నిక కాబడిన కో-ఆప్షన్ సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
కో-ఆప్షన్ సభ్యులకు కమిషనర్ డి.చంద్రశేఖర్ నియామక పత్రం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి నూతనంగా ఎన్నికాబడిన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశీ శ్రీనివాస్ , ఎన్.సుధీర్ బాబు, నగరపాలక సంస్థ విప్ పైడి భీమేశ్వరరావు , కమిషనర్ డి.చంద్రశేఖర్ తో పాటు పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.