కొఠియా గ్రామాల ప్రజలు ఆంధ్రలో కలిసేందుకు మొగ్గు చూపడానికి జిల్లా అధికారులు కనబరిచిన పనితీరు, అందించిన సేవలే ప్రధాన కారణమని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అక్కడి గ్రామాల ప్రజలకు సమర్థంగా అందించారని కితాబిచ్చారు.
అభివృద్ధి పనుల్లో చొరవ చూపారని, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందజేయటంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ఈ మేరకు అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా అధికారుల కృషి, అందించిన సేవలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల కొఠియా గ్రామాల ప్రజలు ఆంధ్రలో కొనసాగడానికి ముందుకొచ్చారన్నారు.
దీంతో మనందరి బాధ్యత మరింత పెరిగిందని, ఇంకా సేవలను విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ సందర్భంగా అందరి అధికారులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని కలెక్టర్ పేర్కొన్నారు.