శ్యాంప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎల్ శర్మన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో 14 శాఖలకు చెందిన శాఖల అధికారులతో పెద్దకొత్తపల్లి మండలంలో కొనసాగుతున్న అర్బన్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా శాఖలకు సంబంధించి పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో ఒక్కొక్క అధికారిని అడిగి తెలుసుకున్నారు. రూర్బన్ మిషన్ పథకం కింద రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. వచ్చే 15 రోజుల్లో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.
మొత్తం ప్రాజెక్టు పనులు మూడు నెలల్లో పూర్తయ్యేలా ప్రణాళికబద్ధంగా పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఉద్యోగులు బాధ్యతతో విధులు నిర్వహించాలని, రూర్బన్ మిషన్ కింద పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
మూడు నాలుగు రోజుల్లో ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టబోయే కొత్త పనులకు సంబంధించి తీర్మానాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రెండు సంవత్సరాలు అయినా నిధులు ఉండి పూర్తికాకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
ఒక కోటి రూపాయలతో నాలుగు గ్రామాల్లో మినీ స్టేడియాలు, జొన్నల బొగుడ రిజర్వాయర్లో రెండు కోట్ల రూపాయలతో టూరిజం బోట్లు ఏర్పాట్లు, మండల పరిధిలోని పలు గ్రామాల్లో పాల ఉత్పత్తులకు విజయ డైరీకి రెండు కోట్ల రూపాయలు, సాతాపూర్ లో మామిడి కోల్డ్ స్టోరేజ్ కి 4 కోట్ల రూపాయల తో నిర్మాణ పనులు మొత్తం 30 కోట్ల రూపాయలతో 419 పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
వారం రోజుల తర్వాత మళ్లీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. 25 పాఠశాలల్లో 50 లక్షలతో లాంగ్వేజ్ ల్యాబ్ లను అందజేసినట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు. మేజర్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభం చేస్తామని ఇంజనీరింగ్ అధికారి తెలిపారు.
ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ సుధాకర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి అంజిలప్ప, డిఇఓ గోవిందరాజులు, డీఎఫ్ఓ కిష్టగౌడ్, ఈఈ పి ఆర్ దామోదరరావు, ఈఈ ఆర్ అండ్ బి ప్రతాప్ రెడ్డి, విజయ డైరీ డిడి సత్యనారాయణ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.