ముగ్గురు వీఆర్వోలను సస్పెండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. కొల్లాపూర్ డివిజన్ లోని గ్రామాలను జిల్లా కలెక్టర్ సందర్శిస్తారని ముందస్తుగానే సమాచారం అందచేసినా మైలారం, మాచుపల్లి, జనుంపల్లి, గ్రామాల వీఆర్వోలు రాలేదు.
గురువారం ఉదయం కోడూరు మండల పరిధిలోని కోడేరు, ఎత్తం, నర్సాయిపల్లి, మైలారం, రాజాపూర్, మాచుపల్లి, జనుంపల్లి గ్రామాలను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. జనుంపల్లి వీఆర్వో ఎప్పుడు గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండకుండా పెద్దకొత్తపల్లి లో ఉంటూ తన ఇంటికే ప్రజలను రమ్మంటూ ఎప్పటికి గ్రామానికి రాడని వీఆర్వో అశోక్ పై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
మైలారం విఆర్వో నాగార్జున రైతు వేదిక, పల్లె ప్రకృతి వనానికి నిర్మాణానికి ఇప్పటివరకు స్థల సేకరణ చేయకుండా నిర్లక్ష్యం వహించాడు. మాచుపల్లి విఆర్వో వెంకటస్వామి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదుల వచ్చాయి. దాంతో ముగ్గురు వీఆర్వోలను సస్పెండ్ చేశారు.
గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రజలకు అందుబాటులో ఉండకపోయినా చర్యలుంటాయని కలెక్టర్ శర్మన్ హెచ్చరికలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ పర్యటించి పరిశీలించారు. నిర్మాణ పనులను ఈ మాసం చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.