తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడుగా మళ్లీ నియమితులైన వేంకటరమణ దీక్షితులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని సాక్ష్యాత్తూ విష్ణు స్వరూపుడని పొగడటంపై జనసేన పార్టీ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది.
జనసేన తిరుపతి ఇన్ చార్జి కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ పోస్టింగ్ ఇవ్వగానే జగన్ ను మహావిష్ణువుతో పోల్చడం దారుణమైన విషయమని అన్నారు. వేంకటరమణ దీక్షితులు తక్షణమే వెళ్లి తాడేపల్లిలో జగన్ పార్టీలో చేరి అధికార ప్రతినిధిగా మారడం మంచిదని ఆయన అన్నారు.
వేంకట రమణ దీక్షితులు వ్యవహారం చూస్తుంటే తిరుమల వేంకటేశ్వరుడికన్నా జగనే గొప్పవాడు అనేలా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అధికార ప్రతినిధిగా వేంకటరమణ దీక్షితులు రాణిస్తారని ఎందుకంటే ఆయన అసత్యాలను కూడా అందంగా చెప్పగలరని కిరణ్ రాయల్ తెలిపారు.