జన్యుమార్పిడి (జీఎం) బియ్యం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భారత్ నుంచి ఎగుమతి అయిన బియ్యపు నూకల్లో జన్యుమార్పిడి రకాలున్నట్లు యూరోపియన్ యూనియన్ ఫిర్యాదు చేసింది. వీటి వినియోగంతో అనారోగ్యం బారిన పడడమే కాకుండా..పలు దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయనే వాదనలను తెరపైకి తీసుకొచ్చింది.
అయితే జీఎం అవశేషాలున్న బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించేది లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ నుంచి జూన్లో ఎగుమతి అయిన 500 టన్నుల బియ్యం ప్రస్తుతం పలు యూరోపియన్ యూనియన్ దేశాలతో సహా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వివాదానికి కారణమయ్యాయి.
వివిధ దేశాల నుంచి వచ్చే ఆహార పదార్థాలను తనిఖీ చేసే యూరోపియన్ కమిషన్ చేసిన ఆకస్మిక తనిఖీల్లో ఈ జన్యుమార్పిడి బియ్యం ఉన్న విషయం బయటపడింది. అమెరికాకు చెందిన మార్స్ ఆహార ఉత్పత్తుల కంపెనీ జీఎం అవశేషాలున్నాయనే భయంతో తన ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కు తెప్పించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇండియా నుంచి వచ్చిన బియ్యాన్ని చాలా దేశాలు మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నాయి.
భారత్ నుంచే జన్యుమార్పిడి బియ్యం ఎగుమతి జరిగిందని పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇండియన్ వ్యవసాయ పరిశోధన సంస్థ రంగంలోకి దిగింది. దేశంలో ఎక్కడెక్కడ జన్యుమార్పిడి వంగడాలను సాగు చేస్తున్నారనే దానిపై ముమ్మర తనిఖీ ప్రారంభించింది. భారత్ నుంచి ఏటా సుమారు రూ.65 వేల కోట్ల విలువైన వరి ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ చేసిన ఫిర్యాదే గనుక నిజమైతే భారత్కు భారీగా నష్టం వాటిల్లనుంది.