సీఐడీ అదనపు డీజీ హోదా, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘిస్తూ పీవీ సునీల్కుమార్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆయన మామ సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా తమ కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఆయన లక్ష్యంగా చేసుకున్నారని సుబ్బారావు అన్నారు.
తన కుమార్తెను సునీల్ వివాహం చేసుకున్న తర్వాత అధిక సొమ్ము, కారులు, వ్యవసాయ భూములు, ఆభరణాలు తీసుకురావాలంటూ డిమాండ్ చేశారన్నారు. కేసును ఉపసంహరించుకోక పోతే జైలుకు పంపుతానంటూ సునీల్ బెదిరించారని సుబ్బారావు అన్నారు. తమ కుటుంబ సభ్యులను వేధించడాన్ని చట్టవిరద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు.
అదే విధంగా ఈ అంశంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్తో దర్యాప్తు జరిపించాలని కోరారు. తమకు భద్రత కల్పించడం సహా సీఐడీ అదనపు డీజీ పోస్టుకు అన్ని విధాలా న్యాయం చేసే అధికారిని నియమించేలా కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించాలని కోరారు.