28.7 C
Hyderabad
April 25, 2024 05: 49 AM
Slider మహబూబ్ నగర్

నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టండి

#narayanapetdistrict

నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా మళ్లీ రెచ్చిపోతున్నా కూడా అడ్డుకోవాల్సిన స్థానిక రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని, ఇసుక మాఫియాను అడ్డుకొని, మాఫియాపై పిడీ యాక్ట్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త,  నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట  జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ హరిచందనలకు ఫిర్యాదు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని అన్నారు. నారాయణపేట జిల్లాలోని రాకొండ, మరికల్, మక్తల్, నేరడ్గం, వర్కుర్, చిత్తనుర్, మగనూర్, మద్దూర్, లింగల్చేడ్, గోటూర్, పూసల్పాడ్, ఊట్కూరు తదితర మండలాల్లో పెద్దవాగు, మన్నేవాగు, బిజ్జరంవాగు, లింగల్చేడువాగు తదితర వాగులనుంచి రాత్రి, పగలు అని తేడా లేకుండా ఇసుక ను మాఫియా తరలిస్తున్నదని అన్నారు.

కొందరి పోలీస్, రెవెన్యూ అధికారులకు లక్షల్లో మామూళ్లు ఇచ్చి దర్జాగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 10న దేవర్ కద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో మక్తల్ నుండి 42 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు పట్టుకొని, స్థానిక పోలీసులకు అప్పగించారని ఆయన గుర్తు చేశారు.

హైదరాబాద్ విజిలెన్స్ పోలీసులకు  కనిపించే ఇసుక మాఫియా లారీలు…నారాయణపేట పోలీసులకు, రెవిన్యూ, మైనింగ్ అధికారులు ఎందుకు కనిపించడంలేదని ప్రవీణ్ ప్రశ్నించారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ, నారాయణపేట జిల్లాలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ, కోట్లాది రూపాయల ఖనిజ సంపదను కొల్లగొడుతూన్నరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇసుక మాఫియాపై వెంటనే చర్యలు తీసుకొవాలని, మాఫియాపై పిడీ యాక్ట్ కింద కేసులు నమోదు చెయ్యాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాకు సహకరిస్తున్న సంబంధిత పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ న్యాయ పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం: ఎస్పీ వెంకటేశ్వర్లు

నారాయణపేట జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుందని, ఇసుక మాఫియాను అరికట్టాలని సామాజిక కార్యకర్త,  నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ నారాయణపేట జిల్లా ఎస్పీ ఏన్. వెంకటేశ్వర్లుకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంకటేశ్వర్లు ఇసుక మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా ఇసుక మాఫియాకు అడ్డాగా మారిన రాకొండ ఉకచెట్టు వాగు నుండి ఒక్క లారీ ఇసుకను మహబూబ్ నగర్ జిల్లాకు, హైదరాబాద్ కు తరలించకుండా రాబోయే 15 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

Related posts

మామునూరు ఎయిర్ పోర్టు భూములపై మంత్రి ఎర్ర‌బెల్లితో క‌లెక్ట‌ర్ భేటీ

Bhavani

సంగీత విద్వాంసుడు ఐవిఎల్ శాస్త్రి ఇక లేరు

Satyam NEWS

కేసు దర్యాప్తు చేయని పోలీసులకు హైకోర్టు అక్షింతలు

Satyam NEWS

Leave a Comment