రాష్ట్రానికి కేటాయించిన నీటి కేటాయింపుల మేరకే నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టి నీటిని డ్రా చేయడం జరుగుతోందని అంతకు మించి ఒక్క చుక్క కూడా డ్రా చేసే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను రాష్ట్ర సమాచార,రవాణా శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య వివరించగా ఈ సమావేశంలో జలవనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొని జలవనరుల శాఖకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో తక్కువ నీటి లభ్యత ఉన్న నేపధ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల సామర్ధ్యాన్ని పెంపొందించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రా, తెలంగాణా విడిపోయినా రెండు ప్రాంతాలు అభివృద్ధి కావాలని నీటి వివాదాలు తలెత్తకుండా సామరస్యంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగాన్ని తగ్గించాలని కృష్ణానది నీటియాజమాన్య బోర్జు(కెఆర్ఎంబి)స్పష్టంగా చెప్పినప్పటికీ తెలంగాణా మాత్రం పూర్తి సామర్ధ్యంతో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని ఆదేశాలివ్వడం దారుణమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
తెలంగాణా నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రి వర్గం తీవ్రంగా ఖండించిందని దీనిపై ప్రధానమంత్రికి కేంద్ర జలశక్తిశాఖ మంత్రికి ముఖ్యమంత్రి లేఖలు వ్రాస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డుకు కూడా లేఖ వ్రాస్తామని తెలిపారు.
తెలంగాణా అక్రమ నీటి వివియోగంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్,కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణా తన ధోరణిని మార్చుకోకపోడవం దురదృష్టకరమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిధ్దంగా ఉన్నామని ఈ విషయంలో ఎంతమాత్రం రాజీపడే ప్రశక్తి లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.