కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ కబ్జాదారులకు తహసీల్దార్ మోతీసింగ్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు.
గ్రామంలోని 278, 279 సర్వే నంబర్లలో భూమిని భూ కబ్జాదారులకు పట్టా చేసి ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తండా వాసులు కలెక్టర్ కార్యాలయాలనికి తరలివచ్చారు.
కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రేకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా తండా వాసులు మాట్లాడుతూ.. గ్రామంలోని 278, 279 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిని కొందరు భూ కబ్జాదారులకు తహసీల్దార్ మోతీసింగ్ పట్టా చేసి ఇచ్చాడన్నారు.
ఆ భూమిలో కాస్తులో ఉన్న వారికి కాకుండా అందులో సంబంధం లేని వారికి, భూమి లేని వారికి పట్టా చేసి ఇచ్చారని ఆరోపించారు.
వెంటనే ఆ పట్టాలను రద్దు చేయాలని, పూర్తి విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.