స్పందన లో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన నాగార్జునరెడ్డి
తన పై వరుసగా హత్యా ప్రయత్నాలు చేస్తున్న ఇసుక దొంగలు వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కుటుంబానికి సహకరిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజిల్ బ్లోయర్ నాయుడు నాగార్జున రెడ్డి కోరారు. ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ను స్వయంగా కలిసి ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే విధంగా, ఆమంచి కుటుంబం ఇప్పటి వరకు చేసిన భౌతిక దాడులు, హత్యాప్రయత్నాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
2015 నుండి ఆమంచి కృష్ణమోహన్, అతని సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు ఎలియాస్ స్వాములు, వారి రక్త సంబంధీకులు, వారి ప్రధాన అనుచరుల నుండి తనకు ప్రాణహాని ఉందని నాగార్జున రెడ్డి తెలిపారు. ఇప్పటికే 15 సార్లు తనపై వారు భౌతిక దాడులకు పాల్పడగా, 4 పర్యాయములు ప్రాణ హాని నుండి బయటపడినట్లు నాగార్జున రెడ్డి ఫిర్యాదులో తెలిపారు.
2015 మే 4వ తేదీన వేటపాలెం మండలం తాసిల్దార్ వద్ద, 2019 మార్చి 5న ఒంగోలు రెవిన్యూ డివిజనల్ అధికారి వారి వద్ద cr.PC 107 ప్రకారం ఆమంచి కృష్ణమోహన్, అతని రక్తసంబంధీకుల నుండి ప్రాణహాని ఉందని పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, సదరు అధికారులు నేరస్థులతో కుమ్మక్కై తన పై దాడులకు సహకరించారని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకార్యాలయం వద్ద దాఖలు పరిచిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన, సదరు అధికారులు నిందితులతో కుమ్మక్కయ్యారని భావించవలసి ఉంటుందని నాగార్జునరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఫిర్యాదులోని అంశాలపై సమగ్రంగా విచారించ వలసినదిగా ఫిర్యాదును జిల్లా ఎస్పీకి బదిలీ చేశారు.