పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అఖిల పక్షం నిరసన వ్యక్తం చేసింది.
పోలీసు పహారా మధ్య నిర్బంధంలో జరిగిందని, సెల్ ఫోన్లు కూడా అనుమతి ఇవ్వకుండా నిర్వహించారని సిపిఎం జిల్లా కార్యదర్శి జీ వెంకట్రాంరెడ్డి, బీజేపీ నాయకులు రఘువీర్ యాదవ్, రైతు నేత యంకోబ, సీపీఎం నాయకులు గోపాల్ , బాల్ రామ్,అంజిలయ్య గౌడ్ న్యూ డేమోక్రసి నాయకులు ప్రశాంత్,సాయి కుమార్ అన్నారు. స్థానిక అభిప్రాయ సేకరణ శిబిరం దగ్గర వాళ్లు నిరసన వ్యక్తం చేశారు.
నారాయణపేట కు కృష్ణా నది కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుండగా వందల కిలో మీటర్ల కు దూరంలో ఉన్న ప్రాంతాలకు నీరును అందిస్తామనడం సమయం ఎక్కువ,ఖర్చు ఎక్కువ అన్నారు. ప్రజలను మభ్య పెట్టడమే తప్ప ఈ ప్రాంతానికి నీరు అందే అవకాశం లేదన్నారు.
భీమా మొదటి దశ ద్వారా జీ ఓ నెంబర్ 69 ప్రకారం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడమే ఉత్తమమని హితవుపలికారు. మన ప్రాంతపు నీళ్లు క్రిందికి వదిలిన నీటికోసమే ఇతర జిల్లాలమీద ఆధారపడే స్థితికి తీసుకురావడం విడ్డూరమని అన్నారు.
పాలమూరు రంగారెడీ ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇవ్వడం అభ్యంతరం లేదన్నారు. తలాపున ఉన్న నీరు అందుకోకపోవడమే పాలకుల దౌర్భాగ్యమన్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.