తెలంగాణ రాష్ట్రంతో విద్యార్థుల ను ఏకత్రాటిపైకి తీసుకొచ్చి…ఉద్యమాలకు నిలయమైన ఓయూలో అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ అంటే ఏంటో యావత్ ప్రపంచానికి తెలియ చెప్పిన ఉద్యమనేత నారాయణ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బీజేపీ పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఇంద్రసేనారెడ్డి ,డా.కే.లక్ష్మణ్, పార్టీకి చెందిన ఇతర నేతలు తమ ,తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) వ్యవస్థాపకుల్లో ఒకరు అయిన నారాయణ దాస్ మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. అనేక విషయాల్లో నాకు సలహాలు సూచనలు అందించిన వ్యక్తి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ ఉద్యమాన్ని తెర మీదకు తీసుకువచ్చి ఉస్మానియా యూనివర్సిటీ లో ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన వ్యక్తుల్లో నారాయణ దాస్ ఒకరన్నారు.
తెలంగాణ సేఫ్ గార్డ్ ఉద్యమాన్ని చేపట్టిన వ్యక్తి అని 1956 తర్వాత తెలంగాణ సేఫ్ గార్డ్ ఉద్యమాల్లో విద్యార్థి లోకం పెద్ద ఎత్తున పాల్గొనేలా చేసిన వ్యక్తి అని గతాన్ని గుర్తు చేసారు. బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ దేశం కోసం సమాజం కోసం పని చేసిన వ్యక్తి అని అన్నారు.
తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసిన వ్యక్తి అని అన్నారు. ఆయన మృతి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని అన్నారు. నారాయణ దాస్ మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నామంటూ పార్టీ నేతలంతా పేర్కొన్నారు.