భారత్ జోడో యాత్రలో నిమగ్నమై ఉన్న రాహుల్ గాంధీ గడ్డం పెంచడాన్ని ఎద్దేవ చేస్తూ సద్దాం హుస్సేన్ తో పోల్చడం బీజేపీ విభజన రాజకీయాలకు నిదర్శనమని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. బీజేపీకి చెందిన ఆసోమ్ ముఖ్యమంత్రి బిస్వా శర్మ రాహుల్ గాంధీ గడ్డంపై ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతుందనేదానికి ఇది నిదర్శనమని డాక్టర్ మల్లు రవి అన్నారు.
భారత్ జోడో యాత్ర చేయడం కూడా ఇందుకేనని, మతాలుగా విడిపోయిన ప్రజలను కలిపేందుకు, భారత్ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ ఎంతో శ్రమకోర్చి భారత్ జోడో యాత్ర చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికి రెండువేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అంటే అది రాహుల్ గాంధీ సంకల్పానికి నిదర్శనమని డాక్టర్ మల్లు రవి అన్నారు. మరొక్క సారి బీజేపీ ఈ విధంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.