రాష్ట్రంలో ముఖ్యంగా జిహెచ్ఎంసిపరిధి లో ఆందోళనకంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, కరోనా రాష్ట్రమంతా విజృంభిస్తూ ఉందని తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి డాక్టర్ మల్లు రవి అన్నారు. రెండు రోజుల పాటు దినసరి పాజిటివ్ కేసులు 1800 కు పైగా పెరగడమనేది భయం గొలిపే విషయమని, మొన్నటి మొన్నటి వరకు తెలంగాణా కొన్ని ప్రాంతాలలో కరోనా ప్రవేశించకుండా ఉండిందని, ఇపుడు రాష్ట్రం లో కరోనా చొరబడని ప్రాంతం లేకుండా పోయిందని ఆయన అన్నారు.
ఒక విధంగా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీ వచ్చిందని, అందువల్ల ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు, కరోనా పానిక్ నుంచి ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ వంటి నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన అన్నారు.
ఈ రాష్ట్రాన్ని కరోనా క్లిష్టకాలంలో ప్రవేశించేందుకు కారణాలను చర్చించాల్సి వుందని ఆయన అన్నారు. కరోనా పర్యవసానాలు రాష్ట్రంలో ప్రజలందరి మీద పడుతున్నాయని, ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక పరిస్థితి బాగా క్షీణిస్తూ ఉందని ఆయన తెలిపారు.
ఇక ఈ విషయాన్ని ప్రభుత్వానికి వదిలేయలేని పరిస్థితి ఎదురయిందని, అందువల్ల అన్ని పార్టీలతో ప్రభుత్వం చర్చించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కనిపించడం లేదని వార్తలొస్తున్నాయ్, మంత్రుల కుటుంబసభ్యులకు కరోనా అంటున్నారు. ప్రగతి భవన్ సెక్యూరిటీ సిబ్బందికి కోవిడ్ అంటున్నారు. ఆసుపత్రులలో పనిచేసే డాక్టర్లకు కోరోనా సోకిందంటున్నారు. ఎమ్మెల్యలకు కరోనా.
ఈ వార్తలన్నీ వింటూంటే నిజంగానే భయమేస్తుంది.తెలంగాణ ఎటువోతున్నదనిపిస్తుంది. అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ ఇఖ జాప్యం చేకుండా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అని మల్లు రవి డిమాండ్ చేశారు.