ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గౌరారం వెంకట్ రెడ్డి కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గౌరారం వెంకట్ రెడ్డి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తాను ఏర్పాటు చేసిన సమావేశం ఎందుకో చెప్పకుండా సీనియర్ నాయకులను కూడా దానికి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు సీనియర్ నాయకులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో గౌరారం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో పాల్గొన్న వారిని అనుచర వర్గంగా గౌరారం ప్రకటించుకున్నారు. దీనితో ఆ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంటే శివన్న , ఏల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,వార్డు మెంబర్ పరుశురాం శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గౌరారం పై సీరియస్ అయ్యారు.
కొన్ని పత్రికలో తన ఇష్టం మేరకు రాయించుకున్నారు. గౌరారం గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. అదే సంబంధాలతో తాము సమావేశానికి హాజరు కావడం జరిగిందన్నారు. అంతే కానీ మమ్మల్ని ఏదో అతని అనుచరులుగా భావించడం కరెక్ట్ కాదన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తాం అని వారు చెప్పారు. ఎన్నికలు వచ్చే ముందు గౌరారం ఇలాంటి వక్రబుద్ధి చూపిస్తాడని తమను కూడా మాయ చేస్తాడని అనుకోలేదన్నారు. గౌరారం కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తే స్వాగతిస్తాము అన్నారు. కానీ ఇలాంటి వక్రబుద్ధి చూపించడం మానుకోవాలని సూచించారు.