తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళుతుండగా ఆయనను పోలీసులు అడ్డగించారు.
శ్రీశైలం వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు రేవంత్ రెడ్డిని బలవంతంగా నిలుపుదల చేశారు. తాను అక్కడ కేవలం పరిస్థితిని గమనించి వచ్చేస్తానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. 9 మంది చనిపోయిన ఈ ఘోరమైన ప్రమాదంలో దోషులు ఎవరో తేల్చాల్సి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిలు ఈ ప్రమాదానికి కారణమని వారిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు తరలించారు.