ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జరిపిన దాడుల్లో హెటిరో సంస్థలో దొరికిన డబ్బులు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినవేనని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికలలో ఖర్చు చేసేందుకు ఈ డబ్బులు తెప్పించిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికార పార్టీ దుర్వినియోగం ఏ విధంగా చేసింది ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.
అభివృద్ధి చేసినమని అంటున్నారు మరి హుజురాబాద్ లో ఎందుకు అంత ఉలిక్కిపడుతున్నారు? మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్ లో గాడ్సే దూరాడని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని బండి సుధాకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ కలిశారని, అందుకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.
ఒకవేళ ఫోటోలు ఉంటే ఎందుకు బయట పెట్టలేదని సుధాకర్ అడిగారు. మార్ఫింగ్ లో దిట్ట అయిన టిఆర్ఎస్ సోషల్ మీడియా ఎవరు ఎవరిని అయినా కలిశారని మార్ఫింగ్ ఫోటోలు సృష్టించవచ్చు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తో లోపాయికారి ఒప్పందం చేసుకుంది టిఆర్ఎస్ పార్టీ అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. రాజ్యసభలో అనేక బిల్లులకు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికల కు జిఎస్టి బిల్లులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సహకరించింది. ఇప్పుడు ఈ విధంగా మంత్రి కేటీఆర్ మాట్లాడటం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని సుధాకర్ అన్నారు.