పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నదీజలాల సమస్యకు పరిష్కారం చూపుతూ గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకం, ఎసెల్బీల్సీ సొరంగ మార్గం ప్రాజెక్టులను పూర్తిచేయాలనే సంకల్పం తో సీఎం కేసీఆర్ పనిచేస్తుండగా వారు ఇలాంటి విమర్శలకు పాల్పడడం తగదని అన్నారు.
అక్రమ ప్రాజెక్టుల కట్టడాలకు ఆంధ్రప్రదేశ్ కు అనుమతి లేదని విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తో పాటు కృష్ణా నదీ జలాల బోర్డు కూడా లేఖలు రాసిందని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ను ఒక్క నీటి చుక్క కూడా వదులుకునేది లేదనే విషయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా గుత్తా గుర్తు చేశారు.
గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని నాడు మంత్రులుగా ఉన్న వారు నోరు మెదపకుండా ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేయడం వారి అవివేకాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో కలిసి రావాలని ఆయన గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు పలికారు