తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఖమ్మం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్వర్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెరాసలో చేరిన వారిలో ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ కార్పొరేటర్ లు మోతారపు శ్రావణి(55వ డివిజన్), ధానాల రాధ(17వ డివిజన్), రఘునాధపాలెం మండలం బుడిదంపాడు గ్రామ సర్పంచ్ మీరా(కాంగ్రెస్)తో పాటు పలువురు ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు. పట్టణాలతో పాటు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేశారని వివరించారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలతో పాటు గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు, గ్రామాలకు, తండాలకు బీటీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు తదితర అనేక అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు.