28.7 C
Hyderabad
April 20, 2024 05: 37 AM
Slider జాతీయం సంపాదకీయం

త్వరలోనే కాంగ్రెస్ ముక్త్ భారత్ ఆవిష్కృతం?

rahul gandhi sonia

ప్రధాని నరేంద్రమోడీ కలలు కన్న కాంగ్రెస్ ముక్త్ భారత్ సాకారం అయినట్లే కనిపిస్తున్నది. లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత నరేంద్రమోడీ మళ్లీ అధికారం చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నైతిక స్థయిర్యాన్ని కోల్పోయింది. సాధారణ పరిస్థితుల్లో అయితే పార్టీ మళ్లీ కొద్ది రోజుల తర్వాత పుంజుకునేదో ఏమో తెలియదు కానీ అప్పుడు పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేయడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది.

సీనియర్ నాయకులు తనకు సహకరించలేదనే కారణంతో ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఏకపక్షంగా తప్పుకున్నారు. ఆ తర్వాత ఎవరు ఎంతగా చెప్పినా కూడా రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దాంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నైతిక స్థయిర్యం కోల్పోయింది. రాహుల్ గాంధీ వైదొలగడంతో ఆ పార్టీకి నాయకత్వం వహించే నాథుడే లేకుండా పోయాడు. చిట్టచివరకు అనారోగ్యంతో ఉన్నా కూడా సోనియాగాంధీనే బాధ్యతను నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది. పార్టీ అంతర్గతంగా ఇలా సతమతం అవుతుంటే సంస్థాగతంగా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది.

ఈ రెండు కారణాలతో బాటు నరేంద్రమోడీ ప్రభుత్వం పాత కేసులను ఒక కొలిక్కి తెచ్చే క్రమంలో కాంగ్రెస్ నాయకులను ఒక్కొక్కరిగా అరెస్టు చేయించేస్తున్నది. కేసుల మెరిట్ డీ మెరిట్ జోలికి వెళ్లడం ఈ దశలో అనవసరం. అయితే ఈ విధంగా అవినీతి, మనీలాండరింగ్ లాంటి కేసులలో కాంగ్రెస్ నాయకులు చిక్కుకోవడం కాంగ్రెస్ పార్టీని మరింతగా కుంగదీస్తున్నది. సీనియర్ నాయకుడు చిదంబరం, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి డి కె శివకుమార్ లను వివిధ నేరాలపై అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడిపై కూడా ఇలాంటి కేసులో ఉన్నాయి.

ఈ విధంగా అరెస్టు అవుతున్ననాయకులను కాపాడుకోలేక కాంగ్రెస్ పార్టీ ఎంతో సతమతం అవుతున్నది. గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు పరిహారం చెల్లిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ కేసులను రాజకీయ కుట్రలుగా చెప్పడం తప్ప మరేం చేయలేకపోతున్నారు. అయితే వరుసగా కాంగ్రెస్ నాయకులు అరెస్టు అవుతుండటంతో వారు ఎన్ని లాజిక్కులు చెప్పినా ప్రజలు నమ్మడం లేదు.

పైగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి పుట్ట అనే విషయాన్ని మరింత బలంగా నమ్ముతున్నారు. ఈ అంశాలన్నీ ప్రధాని నరేంద్రమోడీకి అనుకూలంగా మారుతున్నాయి. దేశంలో నరేంద్రమోడీని సవాల్ చేసే నాయకుడే కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధాలతో ఇప్పటిలో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.

Related posts

నాట్ ఎలౌవుడ్: చంద్రబాబుపై వైసిపి చెప్పులతో దాడి

Satyam NEWS

సాక్షర భారత్ విసిఓ లకి ఇచ్చిన మాట తప్పిన జగనన్న…!

Satyam NEWS

కల్వకుర్తి లో ఇంటలిజెన్స్ రిపోర్ట్ సర్వే కలకలం

Satyam NEWS

Leave a Comment