రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ “ట్రూ అప్” ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడాన్నీ వ్యతిరేకిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నా నిర్వహించింది. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ పిలుపు మేరకు సోమవారం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మాంగాటి గోపాల్ రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రమీలమ్మ,రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసన అనంతరం APSPDCL HR చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ ఏ రషీద్ కు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఈ సందర్భంగా వారు విమర్శించారు. నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న ఉచిత పథకాల కోసం రాష్ట్ర ప్రజలపై పన్నుల మోత మోగిస్తూ నడ్డి విరుస్తున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాల్సిన జగన్ సర్కార్ “ట్రూ అప్” చార్జీల పేరుతో అదనపు భారం మోపడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉందని వారన్నారు
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల మీద పన్నుల భారం మోపే ప్రసక్తే లేదని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను,ఇంటి పన్ను,కరెంట్ చార్జీలు,ట్రూ అప్ చార్జీల మోత మోగించడం ధర్మమా అని వారు ప్రశ్నించారు.
కరోనా కష్టకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదిస్తున్న నాయకుల ఆస్తులను అమ్మి నవరత్నాలు కాకుంటే 100 రత్నాలు ఇచ్చినా రాష్ట్ర ప్రజలకు ఎటువంటి అభ్యంతరం లేదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పేరుతో వడ్డీతో కలిపి వేయడాన్ని పూర్తిగా రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.