టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి బీహార్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ లో ప్రాధాన్యత కల్పించడంపై వేసిన ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే తప్పుడు వక్రీకరణ చేస్తున్నారని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులైన వి.హనుమంతరావు, మధు యాష్కీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసలు ఏమన్నారో స్పష్టంగా తెలుసుకుని వ్యాఖ్యానం చేయాలని ఆయన కోరారు. ఈ నాయకుల ప్రకటనలు టిఆర్ఎస్ కు లాభం చేకూరేలా ఉన్నాయని ఆయన అన్నారు.
బీహార్ ఐఏఎస్, ఐపీఎస్ లకు పోస్టులు ఇవ్వొద్దు అని రేవంత్ రెడ్డి చెప్పలేదని మల్లు రవి వివరణ ఇచ్చారు. ఐఏఎస్ ల పోస్టింగ్ లలో, నియమాకలలో సమతుల్యత పాటించకుండా… బీహార్ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని మాత్రమే రేవంత్ రెడ్డి అడిగారని మల్లు రవి వివరించారు. పిసిసి అధ్యక్షుడు బీహార్ వాళ్లకు వ్యతిరేకం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రాతినిధ్యం లేదని మాట్లాడటం తప్పా అని ఆయన ప్రశ్నించారు.
అన్నీ పదవులు బీహార్ వాళ్ళకే ఇస్తే.. తెలంగాణ ఐఏఎస్..ఐపీఎస్ లు ఎటు పోవాలి..? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అధికారుల్ని అణచివేతను గురి అవుతున్నారు అనడం తప్పా అని మల్లు రవి ప్రశ్నించారు. బీహార్ అధికారులకు ప్రాధాన్యతలు ఇచ్చి అనేక పదవులు ఇచ్చి తెలంగాణ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను పక్కన పెడుతున్నారని, తెలంగాణ అధికారులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది పిసిసి అధ్యక్షుడి అభిప్రాయమని మల్లు రవి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ ఐఏఎస్ లకు పోస్టింగులు ఇస్తున్నారు అని అడిగిన కెసిఆర్ , ఇప్పుడు బీహార్ వాళ్లకు ఎందుకు పోస్టింగులు ఇస్తున్నారు? తెలంగాణ ఐఏఎస్ లకు ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ అడిగారని మల్లు వివరించారు. ఇది జాతీయ, రాష్ట్ర పార్టీలకు సంబంధం లేదని, ఇది రాష్ట్రంలో కేసీఆర్ దోపిడీకి సంబంధించిన అంశమని ఆయన తెలిపారు. ఐఏఎస్ అధికారులు కేసీఆర్ తో కుమ్మక్కై దోపిడీ చేస్తుంటే దాన్ని ప్రశ్నిస్తే బీహార్ వాళ్ళను అవమాన పరిచినట్టు కాదని ఆయన వివరించారు.