కర్ణాటకలో విజయభేరి మ్రోగించిన కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తుందని కాంగ్రెస్ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శనివారం కాంగ్రెస్ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. టపాసుల మోత మోగించి బైక్ ర్యాలీతో గెలుపు ఆనందాన్ని స్వీట్స్ కేకులు తింటూ నాయకులు ఆనంద కేరింతలు కొట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక మాదిరిగానే రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో హస్తం విజయం ఖాయమని జోస్యం చెప్పారు. దేశంలో మోడీ రాష్ట్రంలో బి ఆర్ఎస్ పరిపాలనతో ప్రజలు విసిగెత్తారని, పెరుగుతున్న ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ మధ్యతరగతికి జీవనం గడవక కుదేలవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఓ తండ్రి ఓ కొడుకు ఓ కూతురు ఓ అల్లుడు అంటూ రాజరిక, నియంత ,దొరల పాలనతో రాష్ట్రం అట్టుడుకుతుందని, అధికార పార్టీ నేతలంతా భూకబ్జాలు, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాక్షస పాలన అందిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని తెలిపారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మేజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ సొంతగా చేరుకోవటం కాంగ్రెస్ కు ఈ ఫలితాలు దేశ వ్యాప్తంగా జోష్ ను ఇచ్చాయని ఆయన అన్నారు.
ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల కు సిద్దం అవుతున్న వేళ ఈ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారని ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూల తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.