వర్షాకాలం లో తమకు కలుగుతున్న ఇబ్బందులను ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోని పాలకులు మాకెందుకని కొల్లాపూర్ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఉడుముల వాగు, పెద్దవాగు పొంగిపొర్లుతున్నాయి. ఈ గ్రామం లో ఎక్కువగా గొర్రెల కాపరులు, పశువుల కాపరులు ఉంటారు. అదే విధంగా రైతులు కూడా ఈ వాగు దాటడం కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఒక ఏడాది రెండు సంవత్సరాలు కాదు, దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఎన్ని సార్లు చెప్పినా పాలకులు పట్టించుకోవడం లేదు.
దాంతో నేడు ముక్కిడి గుండం గ్రామంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మిత్ర అభ్యుదయ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు నల్లవెల్లి క్రాంతి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాగు అవతల పక్క గొర్రెలు, పశువులు ఉండడంవల్ల వాటి దగ్గరికి చేరుకోవడానికి నీటి మధ్య నుండి తాడు పట్టుకుని వేలాడుతూ వెళ్లాల్సి వస్తున్నదని అన్నారు.
ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని వాగు దాటి అవతలకి చేరుకుంటున్నారని, కొంతమంది నీటిలో కొట్టుకు పోతున్నారని ఆయన అన్నారు. 20 రోజుల కింద ఇదేవిధంగా వర్షాలు రావడం వల్ల వాగులో పశువులు కొట్టుకుపోయి మరణించాయని ఆయన తెలిపారు.
వర్షాకాలం వచ్చిందంటే వైద్య సౌకర్యం కూడా ఉండదని, ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. అందుకే పాలకుల దిష్టి బొమ్మ దగ్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికైనా పాలకుల నిర్లక్ష్యం వదిలి ఉడుముల వాగు బ్రిడ్జిని పూర్తి చేయాలని, పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించాలని మిత్ర అభ్యుదయ యువజన సంఘం డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో మిత్ర అభ్యుదయ యువజన సంఘం కార్యదర్శి ఎత్తం కిషోర్ రాజు, అధ్యక్షుడు ఏదుల రాముడు, గౌరవ సలహాదారు కదిరి వెంకట స్వామి, కాటమోని గంగాధర్, భీమిని రమేష్, ముద్ర గొల్ల మల్లేష్, గ్రామ పెద్దలు బెటర్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.