భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లో జరిగే ధర్నా కార్యక్రమం విజయవంతం చేయటానికి పట్టణ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న నాయకత్వంలో హుజూర్ నగర్ నుండి భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు బయలుదేరారు.
ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ పెండింగ్ క్లైమ్స్ కు నిధులు విడుదల చేయాలని,బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించాలని, కార్మిక శాఖ లోని ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అక్రమంగా తరలించిన ఒక వెయ్యి నాలుగు కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డుకు జమ చేయాలని డిమాండ్ చేశారు.వెల్ఫేర్ బోర్డులో ఉన్న 36 వేల పెండింగ్ క్లైమ్స్ ను వెంటనే పరిష్కరించి కార్మికులకు సహకరించాలని కోరారు. రాష్ట్ర సంక్షేమ బోర్డు అడ్వైజరీ కమిటీ కార్మిక సంఘాల నాయకులతో నియమించాలని, ఖాళీగా ఉన్న వనపర్తి ఏ.ఎల్.ఓ పోస్టు, జిల్లాలలో ఖాళీగా ఉన్న ఏ సి ఎల్,డి సి ఎల్,సీనియర్ అసిస్టెంట్,జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు.వెల్ఫేర్ బోర్డులో పేరు నమోదుకు రేషన్ కార్డు తప్పకుండా ఉండాలని నిబంధనలు తొలగించాలన్నారు.60 సంవత్సరాలు పైబడిన వారికి నెలకు పది వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద మరణానికి 10 లక్షల రూపాయలు,సహజ మరణానికి ఐదు లక్షలు,పెళ్లి,ప్రసూతి కానుక లక్ష రూపాయలకు పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రావులపెంట వెంకయ్య, సహాయక కార్యదర్శి లకావత్ బాలాజీ నాయక్,జెడ్ బాలశౌరెడ్డి,వెంకన్న, తిరుమలేశు, గోవిందు,నరేష్,సైదులు,నాగుల్ మీరా, బాబులు,సుజాత,ఉమా తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్