మారిన పరిస్థితులు అర్థంచేసుకోకుండా వ్యాఖ్యానాలు చేసిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అభాసుపాలయ్యారు. పార్టీ విధానానికి విరుద్ధంగా మాట్లాడిన సుజనా చౌదరి రాజకీయ పరిపక్వత లేదని మరో మారు నిరూపించుకున్నారు. రాజధాని అమరావతి విషయంలో తగిన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆయన చెప్పిన గంటలోనే భారతీయ జనతా పార్టీ నుంచి వివరణ వచ్చింది.
సుజనా చౌదరి చెప్పింది తన సొంత అభిప్రాయమే కానీ పార్టీకి సంబంధం లేదని అధికారికంగా వివరణ ఇచ్చారు. దాంతో ఒక్క సారిగా సుజనా చౌదరి పరువు గంగలో కలిసినట్లయింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరిగిన కొద్ది గంటల్లోనే అమరావతి లో రాజధాని ఉండాలా వద్దా అనే అంశంపై కొత్త చర్చ ప్రారంభం అయింది.
కన్నా లక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అమరావతి లోనే రాజధాని కొనసాగాలని గట్టిగా వాదించారు. తెలుగుదేశం పార్టీ వైఖరి కూడా ఇదే కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ ను చంద్రబాబు ఏజెంటుగా విజయసాయి రెడ్డి లాంటి వారు అభివర్ణించారు.
బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైఖరి భిన్నంగా ఉండేది. రాజధాని అనేది కేంద్రం పరిధిలోకి రాదని ఆయన గట్టిగా వాదించేవారు. అందుకోసమే జీవీఎల్ ను విజయసాయిరెడ్డి ఏజెంటుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించేవారు.
ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన సోము వీర్రాజు చంద్రబాబునాయుడికి బద్ధ వ్యతిరేకి. అవసరం లేని విషయాలలో కూడా చంద్రబాబును విమర్శించడమే ఆయన పనిగా పెట్టుకుంటారు. పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో ఇంతకాలం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీ వీ ఎల్ నరసింహారావు చెప్పేది కన్నా లక్ష్మీనారాయణ చెప్పేది వేరుగా ఉండేది.
ఇప్పుడు సోము వీర్రాజు, జీవీఎల్ ఒకే పాట పాడుతున్నారు. మారిన ఈ పరిస్థితులపై అవగాహన లేకుండా గతంలో చెప్పినట్లుగానే సుజనా చౌదరి చెప్పడం, పార్టీ ఖండించడంతో ఆయన పరువు కాస్తా పోయింది.