ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ఎంతో గొప్పగా ఉందని ముఖ్యమంత్రి జగన్ తరచూ చెబుతుంటారు. దేశంలోనే అత్యధిక గ్రోత్ రేట్ కూడా ఉందని తరచూ ప్రకటనలు వస్తుంటాయి. అయితే రోడ్డు ఇప్పటికే వేసిన కాంట్రాక్టర్లకే డబ్బులు ఇవ్వలేదు… ఇక కొత్త రోడ్లు ఏం వేస్తాం అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కలిగిరి మండలం నాగసముద్రంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ గ్రామంలో సిసి రోడ్లు వేయాలని ఎమ్మెల్యేని స్థానికులు కోరారు. కొత్త రోడ్లు వేయలేమని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తేల్చి చెప్పేశారు. వేసిన రోడ్లకు బిల్లులు రాక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాం కొత్త రోడ్లు వేయడం కుదరదని ఎమ్మెల్యే మేకపాటి తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అవాక్కైన స్థానికులు , అధికారులు, నాయకులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.