సమాజానికి రక్షణ కల్పించడం, ప్రజలకు శాంతి అందించే క్రమంలో పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా పోలీసు శాఖ వివిధ చర్యలు తీసుకుంటున్నదని అదనపు ఎస్.పి. ఎన్.వేంకటేశ్వర్లు అన్నారు. మహబూబ్ నగర్ రూరల్ పి.ఎస్. పరిధిలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు పోలీసు బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీ లోని గృహాలను తనిఖీ చేశారు. అక్కడ నివాసం, అద్దెకు ఉంటున్న వ్యక్తులతో మాట్లాడుతూ వివరాలు తెలుసుకున్నారు. కొత్త వ్యక్తులకు ఇండ్లు అద్దెకు ఇచ్చే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శివారు కాలనీల్లో అనుమానిత వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసు లకు డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
కాలనీ పెద్దలతో మాట్లాడుతూ, cc కెమెరాల ఏర్పాటుకు చొరవ చూపాలని వీటివలన కాలనీకి ఎంతో రక్షణ లభిస్తుందని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుకు ప్రజలు ఇచ్చే సహకారం అత్యంత విలువైనదని అధికారి పేర్కొన్నారు. ఈ తనిఖీలలో భాగంగా సరైన ధ్రువ పత్రాలు లేని మూడు మోటారు బైకులు, ఒక ఆటోను రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.