కరోనా వస్తే ఏమౌతుంది? ఏమౌతుందో ఎలా ఉంటుందో లక్షణాల గురించి చాలా మంది చెబుతున్నారు. కరోనా నుంచి ఎంతో మంది బయట పడుతున్నారు, అలా బయటకు వచ్చిన వారి గురించి ఎవరూ చెప్పడం లేదు అని కూడా అంటున్నారు.
కరోనా మరణాలను మాత్రమే చూసి అందరూ కంగారు పడుతున్నారు అని కూడా ప్రభుత్వాలు అంటున్నాయి. మరణాలు మాత్రమే చూడకుండా కోలుకునే వారిని చూసి ధైర్యం తెచ్చుకోవాలని కూడా చాలా మంది చెబుతున్నారు.
మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. పరీక్షలు ఎక్కువ చేస్తుంటే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి అని వాదన కూడా వినిపిస్తున్నది. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. కరోనా వచ్చి చనిపోతే???
చనిపోతే ఏముంటుంది?…… కరోనా రోగులు చనిపోయిన తర్వాత ఏం జరుగుతున్నదో చూస్తే భయం పుట్టకమానదు. కరోనాతో మరణించిన వారి భౌతిక కాయాన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో చూస్తే నోట మాట రాదు. కుక్కలో పందులో పిల్లులో చనిపోతే వాటిని ఎలా ఈడ్చి పారేస్తారో అలా కరోనా వచ్చి చనిపోయిన వారి మృతదేహాలను పారేస్తున్నారు.
ప్రొక్లయినర్ లతో పెద్ద పెద్ద గుంతలు తీసి శవాలను కుక్కల శవాలను ఈడ్చినట్లు ఈడ్చి పడేస్తున్నారు. ఒకే గుంతలో పది వరకూ శవాలను పూడ్చి పెడుతున్నారు. అన్ని చోట్లా ఎలా జరుగుతున్నదో తెలియదు కానీ కర్నాటకలోని ఒక ప్రాంతంలో ఇలా జరుగుతున్నది. ఇది చూస్తే కరోనా అంటే భయం పుట్టక మానదు. కనీసం అలా భయం పుడితేనైనా ప్రజలు సామాజిక దూరం పాటిస్తారు.
కనీసం అలా భయంపుడితేనైనా నోటికి మూతికి మాస్కులు వేసుకుంటారు. చేతులు సబ్బుతో కడుక్కుంటారు. విచ్చల విడిగా తిరగడం మానేస్తారు. మానేయాలి. అందుకే ఈ వార్త ప్రెజెంట్ చేయాల్సి వస్తున్నది తప్ప ఇంత అమానవీయ సంఘటన వెలికి తీసుకురావడానికి ఎంతో బాధగా ఉంది.