కరోనా కష్ట సమయంలో ఎంతో మంది తమకు తోచిన సేవ చేస్తున్నారు. చేతకాని వారు గమ్మున ఇంట్లో కూర్చుంటున్నారు. అయితే మరి కొందరు ఉన్నారు. వారు కరోనా మహమ్మారిని కూడా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. అత్యంత హేయంగా ప్రవర్తిస్తున్నారు.
కరోనా పై జరుపుతున్న పోరాటానికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే ప్రధాన మంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయ నిధి ఏర్పాటు చేశారు. దానికి కోట్లాది రూపాయల నుంచి వంద, పది రూపాయల వరకూ ఎంతైనా సహాయం చేయవచ్చు.
పైగా ఈ సహాయ నిధులకు ఇచ్చే విరాళాలకు పన్ను రాయితీలు కూడా కల్పించారు. అయితే డబ్బులు ఇవ్వలేని వారు వస్తు రూపేణా సాటి వారికి సాయం చేస్తున్నారు. కొందరు నిత్యావసర వస్తువులు సేకరించి సాటివారిని ఆదుకుంటున్నారు. కొందరు సొంత డబ్బుతో పారిశుద్ధ్య పని వారిని చాయ్ బిస్కెట్లు అందచేస్తున్నారు.
ఈ పనులన్నీ చేసే వారు ఉత్తములు. మరి కొందరు దాతల నుంచి విరాళాలు సేకరించి అవసరమైన వారికి నిత్యావసర వస్తువులు అందచేస్తున్నారు. ఇది కూడా ఫర్వాలేదు. సాటి మానవుడికి సాయం చేస్తున్నారని సరిపెట్టుకోవచ్చు. అయితే కొందరు అధములు ఉన్నారు.
కరోనా వారికి సోకదనే ధీమాతో అందరి నుంచి బలవంతంగా విరాళాలు సేకరిస్తున్నారు. బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అలా వసూలు చేసిన డబ్బులు నొక్కేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు ఆన్ లైన్ లో కూడా ఇలాంటి దందాలు మొదలు పెట్టినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
ఇదేమి దౌర్భాగ్యమో అర్ధం కాదు. భూ కంపమో, వరదలో వస్తే ఒక ప్రాంతానికే వచ్చి ఉంటాయి కాబట్టి మిగిలిన ప్రాంతాల లోని దౌర్భాగ్యులు ఈ విధంగా వసూళ్లకు పాల్పడ్డారంటే ఏదో కక్కుర్తి పడ్డాడులే అనుకోవచ్చు. కానీ ఇదేం దౌర్భాగ్యమో మానవాళి మొత్తాన్నీ కబళిస్తున్న కరోనా ఎవరిని ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలియదు. ఇంతటి ఘోర విపత్తులో కూడా విరాళాల పేరుతో దండుకుంటున్నారంటే వారి దరిద్రానికి జోహార్లు పలకాలి.