తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం జరిగింది. కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. కాకినాడ కార్పోరేషన్ పరిధిలో కిట్లు పక్కదారి పట్టినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు.
దీంతో నగరపాలక సంస్థ మెడికల్ ఆఫీసర్ కరీముల్లా ను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సస్పెండ్ చేశారు. అదే విధంగా హెల్త్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ ను మాతృసంస్థకు బదిలీ చేశారు. కిట్ల మాయాజాలంపై పూర్తి స్థాయి విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఫోర్జరీ సంతకాలతో జిజిహెచ్ కు చెందిన ఉద్యోగి మరో 300 కిట్లు తీసుకున్నట్టు విచారణలో గుర్తించారు. గతంలో కాకినాడ జీజీహెచ్ లో ఎంఎన్ఓగా పని చేసిన బాషా ఫోర్జరీ చేసినట్టు నిర్ధారణ అయింది. బాషా ప్రస్తుతం అమలాపురం ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తోన్నాడు.
అతను జీజీహెచ్ ఆర్ఎంఓ సంతకం ఫోర్జరీ చేసి 300 కిట్లు తీసుకుని వెళ్లినట్టు జిల్లా వైద్యాధికారి సుబ్రహ్మణ్యేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ త్రీ టౌన్ పోలీసులు రంగంలోకి దిగడంతో బాషా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు.