కరోనా వ్యాధితో మరణించిన వారి మృతదేహాలు ఏం చేయాలి? ఖననం చేయడం కరెక్టేనా? ఖననం చేస్తే వైరస్ మళ్లీ తిరిగి వ్యాపించదా? భయం కలిగించే ఈ వాస్తవాన్ని గోల్నాక డివిజన్ లోని కాంఘారీనగర్ బస్తీ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తమ ఇళ్ల పక్కన ఉన్న స్మశాన వాటికలో కరోనా వ్యాధితో మరణించిన ఒక వ్యక్తి భౌతిక కాయాన్ని నేడు ఖననం చేశారు. బస్తీవాసులు ఏం చేయాలి? భయం భయంగానే బతకాలా? అలాగే బతకాల్సిందే అంటున్నారు పోలీసులు.
బస్తీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం రెయిన్ బజారుకు చెందిన ఓ వ్యక్తి కరోనా తో మరణించగా శవాన్ని రెయిన్ బజారు పోలీసు ఎస్సై కరణ్ కుమార్, ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి తమ బస్తీ అనుకోని ఉన్న శ్మశాన వాటికలో దగ్గరుండి ఖననం చేయించారు.
దీనికి తాము భయాందోళనకు గురి అవుతున్నామని తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న దగ్గరలోని అన్ని బస్తీల వాసులు అక్కడికి చేరుకుని పోలీసులను నిలదీశారు. ఈ విషయంపై బందోబస్తులో ఉన్న కాచిగూడ పోలీసు స్టేషన్ ఎస్సై మధుకు కూడా తమ ఆందోళనను బస్తీ వాసులు తెలియజేశారు.
ఎస్సై మధు బస్తీవాసులను సముదాయించేందుకు ప్రయత్నం చేశారు తప్ప ఖననాన్ని నిలుపుదల చేయలేదు. కరోనా పేషంట్ ను ఇలాఖననం చేయడం వల్ల ఎవరికీ ఏమీ కాదని పోలీసులు అంటున్నారు. కనీసం కరోనా పేషంట్ మృతదేహాన్ని ఖననం చేసిన చోట క్రిమి సంహారక మందులు స్ర్పే చేయాలని కోరినా కూడా పోలీసులు పట్టించుకోలేదు.
జీహెచ్ఎంసి అధికారులు స్పందించడం లేదని, 4 గంటల గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బస్తీవాసులు ఆరోపించారు. ఇలా చేయడం న్యాయమా అని అడిగిన బస్తీ వాసులైన జీహెచ్ఎంసి జవాన్ రాంబాబు, సత్యం న్యూస్ రిపోర్టర్ కళ్యాణ్ బాబుల పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బస్తీ వాసులు తెలిపారు.
వెంటనే స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఈ విషయం చెప్పినట్లు బస్తీ వాసులు తెలిపారు.