కరోనా మహమ్మారి పట్ల ప్రజలను చైతన్యం చేయడంలో కళారూపాలు, పాటలు కీలకంగా పని చేస్తాయని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ సి. నర్మద చెప్పారు. పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వ సూచనలు పాటించాలంటూ రూపొందించిన పాటలను శనివారం ఆమె జిల్లా ఎస్పీ కార్యాలయంలో ల్యాప్ టాప్ ద్వారా ఆవిష్కరించారు.
కళాబృందం ఆధ్వర్యంలో రూపొందించిన పాటలను విని ప్రజలను చైతన్యం చేసేలా ఉన్నాయని కళాబృందాన్ని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను కరోనపై చైతన్యం చేయడంలో కళారూపాలు, పాటలు కీలకంగా పని చేస్తాయని ఆమె అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ప్రజల భాగస్వామ్యమే ప్రధానమని ప్రజలంతా మరింత చైతన్యవంతులయ్యేలా కళాబృందం జిల్లా వ్యాప్తంగా స్థానిక పోలీసులు సహకారంతో అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్.ఐ. వై.వి. ప్రతాప్, కళాబృందం ఇంచార్జ్ హుస్సేన్, పురుషోత్తం, చంద్రశేఖర్, సత్యం, భాస్కర్, కవిత, పరమేష్, కరుణ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.