కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి ఇప్పుడు కరోనా టెస్టులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఒక వ్యక్తి కరోనాతో చనిపోయాడు. అతను 10 సంవత్సరాల కిందటే గ్రామాన్ని వదిలి వెళ్ళాడు.
హైదరాబాద్ లో నివాసం ఉంటూ కరోనా బారిన పడ్డాడు. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు. ఆ వ్యక్తిని నిన్న గ్రామానికి తెచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా వ్యాధివల్ల అతను చనిపోయినట్లు తెలిసి కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారో లేక తెలియక పాల్గొన్నారో తెలియదు కానీ మొత్తం 43 మంది అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
దాంతో వారికి ఇప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అంత్యక్రియలకు హాజరైన 43 మంది వ్యక్తులను గుర్తించామని వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.